Wednesday, January 25, 2012

తెలుగు ఆణిముత్యాలు : వేమన

http://en.wikipedia.org/wiki

హైదరాబాదు టాంక్‌బండ్ పై వేమన విగ్రహం
యోగి వేమన

"విశ్వదాభిరామ వినురవేమ" అనే మాట వినని తెలుగు వాడు ఉండడు. వానకు తడవనివారు, ఒక్క వేమన పద్యం కూడా రాని తెలుగువారు ఉండరని లోకోక్తి. [1].

పామరులకు కూడా అర్థమయ్యే భాషలో పద్యాలు చెప్పి ప్రజల్ని మెప్పించిన కవి, వేమన . ఆటవెలది తో అద్భుతమైన కవిత్వము, అనంతమైన విలువ గల సలహాలు, సూచనలు, విలువలు, తెలుగు సంగతులు ఇమిడ్చిన మహానుభావుడు, యోగి వేమన.

జీవితం

వేమన చరిత్ర అస్పష్టంగా ఉంది. సుమారు 1352 - 1430 మధ్య కాలములో జీవించి ఉండవచ్చు. బహుళ ప్రచారంలో ఉన్న కథనం ప్రకరం వేమన వివరాలు ఇలా ఉన్నాయి.

వేమన కొండవీటి రెడ్డిరాజవంశానికి చెందిన వాడు అని, గండికోట దుర్గాధిపతులతో సంబంధం కలిగినవాడని అంటారు. కానీ ఇది నిజం కాదని పరిశోధకులు తెలియజేస్తున్నారు.[1] కడప మండలంలోని ఒక చిన్న పల్లెలో మధ్య తరగతి కాపు కులస్థులకు జన్మించాడని అంటున్నారు. ఆయన నందన నామ సంవత్సరము, ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమి రోజున జన్మించారు. ఆయన తన జన్మస్తలాన్ని తనే ఒక పద్యంలో వివరించారు.
 
   నందన సంవత్సరమున  
   బొందుగ నాశ్వ(యు) జ శుద్ధ వున్నమినాడున్ 
   బృందార కాద్రి సేతువు 
   నందున నొక వీర వరుని జన్మము వేమా!
   బృందారక  =ఘనమైన 
   అద్రి=కొండల  
   సేతువు = సముద్రాన్ని కానీ , నదిని కానీ రెండుగా చీల్చేది (భూమి). (రామ సేతు మనకు శ్రీలంకకు మధ్య నున్న సముద్రాన్ని చీలుస్తూ నిర్మించినది . )
   పై పద్యంలో వేమన ఆచార్యులు రెండు గొప్ప కొండల నడుమనున్న సేతువు తన జన్మ స్థలం అని చెప్పారు.  రెండు కొండలను  నడుమ నుండి పారే నదులు మనకు చాల ఉన్నాయి , ఉదాహరణకు కృష్ణ నది.
   కానీ అవి సేతువు ఏర్పరచలేదు .  మన ఆంధ్రప్రదేశ్ లో అలాంటి ప్రదేశం ఉండేది కడప జిల్లాలో  వేంపల్లి కి దగ్గరలో నున్న " గండి"  లో  'వీరన్న గట్టు పల్లి"   అనే గ్రామం వేమన గారి జన్మస్థలం.
 పాపాగ్ని నది  ఇ క్కడి   శేషాచల కొండల శ్రేణిని రెండుగా చీల్చి సేతువుని ఏర్పరుస్తుంది. వేమన జన్మస్థలం వీరన్నగట్టుపల్లి అనడానికి ఒక గొప్ప నిదర్శనం ఉంది. 

1820 లో మద్రాసు గవర్నర్ గా నియమితులైన 'సర్ థోమస్ మన్రో' గారు పన్నులు వసూలు చేసే నిమిత్తం కడపలో నున్న గండికి ప్రవేశించారు. అక్కడ ఆయనకు బంగారు తోరణాలు కనిపించాయి. వారు తన సైనికులతో ఆ విషయం చెప్పగా , వారెవ్వరకు ఆ తోరణాలు కనిపించలేదు. ఆయన అక్కడున్న వాళ్ళతో "ఇక్కడో రాజాధి రాజు ఉన్నాడు, ఎక్కడున్నాడో వెతకండి" అన్నారు. వాళ్ళు గండి మొత్తం గాలించి ఎవరు లేరని తేల్చారు కానీ, థోమస్ మన్రో గారు మాత్రం అక్కడే విడిది చేసి చాల రోజులు ఉన్నారు. గండి లో నున్న శ్రీ ఆంజనేయ స్వామి బొమ్మ ఈ బంగారు తోరానికి కారణం అని భావించి అక్కడ ఆలయ నిర్మాణానికి సంకల్పించారు. కానీ అక్కడకు కొన్ని గజాల దూరంలో నున్న వీరన్న గట్టు పల్లి నుండి ప్రసరించిన దివ్య కిరణాలే ఆ బంగారపు తోరణాలు. అవి యోగి వేమన పూజించి వదిలిన యంత్రం నుండి వచ్చినవి కావచ్చు, ఆయన ఆత్మ స్వరూపం నుండి వచ్చినవి కావచ్చు. విచిత్రం ఏమిటంటే, ఈ బంగారు తోరణాలు కనిపించిన ఆరు నెలల్లో మన్రో గారు చనిపోయారు. పాములకు, సిద్దులకు తెలిసి కానీ తెలియకకాని కష్టం కలిగితే ఫలితం వేరుగా ఉంటుంది అని లోకంలో నానుడి. తన జన్మస్థలాన్ని మంది మార్బలంతో ఆణువణువూ పరిశీలించడం ఆ మహా యోగికి బహుశ నచ్చివుండలేదేమో.

ఇతను యవ్వనంలో వేశ్యాలోలుడిగా జీవించాడు. కొంతకాలానికి విరక్తిచెంది, తపస్సు చేసి యోగిగా మారాడు. సమాజానికి హితబోధ చేస్తూ వేలాది పద్యాలు చెప్పాడు. చివరికి కడప దగ్గరి పామూరుకొండ గుహలో శార్వరి నామ సంవత్సరం శ్రీరామ నవమి నాడు సమాధి చెందాడు.

వేమన సమాధి అని ఇప్పటికీ ప్రసిద్ధమైనది కదిరి తాలూకాలోని కటారుపల్లె. ఇక్కడ వేమన సమాధి ఉంది. వేమన రసవాది అని స్వర్ణవిద్య కోసం గురువులకై వెతికాడని ఐతిహ్యం ఉంది.

వేమన పద్యాలలో అతని జీవితం

వేమన పద్యాలలో అతని జీవితానికి సంబంధించిన క్రింది పద్యాలు ముఖ్యంగా ఉదాహరిస్తారు.
నందన సంవత్సరమున; పొందుగ కార్తీకమందు బున్నమినాడీ
వింధ్యాద్రి సేతువులకును, నందున నొక వీరు డేరుపడెరా వేమా!


ఊరుకొండవీడు వునికి పశ్చిమవీధి; మూగచింతపల్లె మొదటి యిల్లు

ఎడ్డిరెడ్డికులము యేమని చెప్పుదు; విశ్వదాభిరామ వినురవేమ!


కాదనడెవ్వరితోడను; వాదాడగబోడు వెర్రివానివిధమునన్

భేదాభేద మెరుంగును; వేదాంత రహస్యములను వేమన నుడువున్ ||

సాధారణంగా ప్రచారంలో ఉన్న కధాంశాలు

వేమన జీవితం గురించి (పెద్దగా పరిశోధన జరుగక ముందు) ఈ క్రింది కధ ప్రచారంలో ఉంది. (నేదునూరి గంగాధరం సంకలం చేసిన "5000 వేమన పద్యాలు" పుస్తకం ఆరంభంలో ఇచ్చిన కధ). [2]

కొండవీడు పాలించిన కుమారగిరి వేమారెడ్డి కాలంలో ఒక బ్రాహ్మణ యువకుడు భిల్లకన్యను వివాహమాడి అడవిలోని పరుసవేది జలాన్ని సంగ్రహించాడు. ఒక కోమటి మిత్రుడు ఆ బ్రాహ్మణునినుండి పరుసవేదిని కుయుక్తితో తీసుకొని ఆ బ్రాహ్మణుని మరణానికి కారకుడయ్యాడు. ఇది తెలిసి రాజు కుమారగిరి వేమారెడ్డి కోమటి సంపదను స్వాధీనం చేసుకొన్నాడు. కోమటి ఆత్మహత్య చేసుకొన్నాడు. ఆ హత్యాపాతకం పోవడానికి కోమటి వేమారెడ్డి పలు ధర్మకార్యాలు చేయడమే కాకుండా తన పిల్లలకు ఆ బ్రాహ్మడి పేరూ, కోమటి పేరూ పెట్టాడు. అలా అతని కొడుకులు పెదకోమటి వెంకారెడ్డి, రాచవేమారెడ్డి, వేమారెడ్డి. ఈ మూడవ కొడుకే వేమన కవి అయ్యాడు.

యవ్వనంలో వేమన వేశ్యాలోలుడై తిరిగేవాడు. బంధువులు అతన్ని అసహ్యించుకొనేవారు కాని వదిన మాత్రం చిన్నపిల్లవాడిని వలె ఆభిమానించేది. ఒక వేశ్య అతనిని వలలో వేసుకొని, అన్ని నగలు సాధించుకొని, తుదకు అతని వదినగారి ముక్కు బులాకీ తెమ్మని అడిగింది. మంగళసూత్రం వలె ముత్తయిదు చిహ్నమైన బులాకీ ఇవ్వడానికి ముందు వదిన పెట్టిన నియమం వల్ల వేమన తాను తుచ్ఛమైన శారీరిక సౌఖ్యాలకోసం వెంపర్లాడుతున్నానని గ్రహించాడు. జ్ఞానాన్ని ప్రసాదించిన వదినకు ప్రణమిల్లాడు.


తరువాత వ్యవసాయం చేయసాగాడు. ఎవరికీ పనికిమాలిన వెర్రిపుచ్చకాయలు సాగుచేసి కూలిగా ఆ పుచ్చకాయలే ఇస్తానన్నాడు. అతిపేదరికంతో బాధపడుతున్న ఒక కుటుంబం అలా పుచ్చకాయలు తీసికెళ్ళి వాటిని తెరచి చూస్తే అందులో మణులున్నాయట. తరువాత ఆ సంపదతో వేమన అన్న భాగ్యవంతుడయ్యాడు.


వేమన వదిన నగలను అభిరాముడనే విశ్వబ్రాహ్మణుడు చేసేవాడు. ఆ అభిరాముడు ఒక యోగిని సేవించి ఆతని అనుగ్రహానికి పాత్రుడయ్యాడు. అయితే చివరి రోజున యుక్తిగా అభిరామయ్యను తమ భవనంలో కట్టడి చేసి, ఆ యోగి అవసాన సమయంలో వేమన వెళ్ళి బీజాక్షరాలు తన నాలుకపై రాయించుకొన్నాడు. తిరిగి వచ్చి అభిరామయ్య కాళ్ళపైబడి క్షమించమని వేడుకొన్నాడు. తరువాత అభిరామయ్య పేరు చిరస్థాయిగా ఉండేలా తన పద్యాలలో చెప్పాడు. ఆ తరువాత వేమన దేశమంతటా తిరిగి మఠాలు కట్టించాడు. తత్వాన్ని బోధించాడు. అందరి యెదుటా యోగి సంప్రదాయంలో మహాసమాధి చెందాడు.

పరిశోధనాత్మక జీవిత చిత్రం

వేమన కాలం గురించీ, జీవితం గురించీ సి.పి. బ్రౌన్, తరువాత మరికొందరు అధ్యయనం చేశారు. వంగూరి సుబ్బారావు, వావిళ్ళ వెంకటేశ్వరశాస్త్రి, బండారు తమ్మయ్య, ఆరుద్ర, రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ, వేమూరి విశ్వనాధశర్మ, కొమర్రాజు వేంకటలక్ష్మణరావు, పంచాగ్నుల ఆదినారాయణశాస్త్రి, కట్టమంచి రామలింగారెడ్డి వంటి పండితులు, పరిశోధకులు ఈ విషయంపై వివిధ అబిప్రాయాలు తెలిపారు. ఈ పరిశోధనల సారాంశం, వాటి గురించి కొంత ఖండన త్రిపురనేని వెంకటేశ్వరరావు "వేమన - పదహారేళ్ళ పరిశోధన"లో ఉన్నది. అతని కాలం గురించి ఏకాభిప్రాయం ఇప్పటివరకూ లభించలేదు. వివిధ పద్యాలలో ఉన్న పాఠాంతరాలు ఈ సమస్యను మరింత జటిలం చేస్తన్నాయి. త్రిపురనేని వెంకటేశ్వరరావు అభిప్రాయం ప్రకారం వేమన జీవితం గురించిన ఊహాచిత్రం ఇలా ఉంది. [3].

వేమన ఒక మోతుబరి రైతుబిడ్డ. ఊరికి పెదకాపులైనందున వారికి ఆన్ని భోగాలు ఉన్నాయు. చిన్నతనంలో తన సావాసగాండ్రకు నాయకునిగా మెలిగాడు. మూగచింతల పెదకాపునకు ఆ దేశపు రాజధాని కొండవీడులో కూడ ఒక ఇల్లు (విడిది) ఉన్నది. పదేండ్ల ప్రాయంలో వేమన చదువుకోసం నగరానికి వెళ్ళాడు. దిట్టలైన గురువులవద్ద చదువుకొన్నాడు. సంస్కృతము, గణితము నేర్చుకొన్నాడు. (ఒకటి క్రింద నొక్కటొనర లబ్దము పెట్టి వరుసగా గుణింప వరుస బెరుగు - geometric progression - తెలుసుకొన్నాడు). పద్దులు వ్రాయగలడు. సాము, కసరత్తులలో ఆసక్తి కలిగియున్నాడు. నీతిని తెలిసినవాడు. రాగాలలోను, వీణానాదంలోను నేర్పరి. సాహసికుడు. స్వచ్ఛందుడు. బుద్ధిమంతుడు.


కలిమి, కులము కలిగినవాడు, సాహసి, కళాభిమాని, యువకుడు అయిన వేమన పట్టణంలో వేశ్యలింటికి పోవడానికి అలవాటు పడ్డాడు (ఇది నాటి సామాజిక నీతికి విరుద్ధం కాదు). కాని అతని సొమ్ములన్నీ కరిగిపోగా అభాసుపాలయ్యుంటాడు. చివరకు ఎలాగో తంటాలుపడి, సమస్యను పరిష్కరించి అతనికి వివాహం చేశారు పెద్దలు. సంసారం బాధ్యతగా సాగించాడు కాని కాలంతోపాటు సమస్యలు పెరిగాయి. భార్యపట్ల ఆకర్షణ తగ్గింది. తరిగి పోయిన ఆస్తితో పెదకాపు కొడుకు ఊరిలో మనగలగడం కష్టం అయ్యింది. ఊరు విడచి జమీందారునో, చిన్నపాటిరాజునో ఆశ్రయించి కొలువులో ఉద్యోగం చేసి ఉండవచ్చు. బహుశా పద్దులు, భూమి పన్నులు, తగవుల పరిష్కారం వంటిపనులు అతనికి అప్పగింపబడి ఉండవచ్చును. కాని అతను నిక్కచ్చిగా ధర్మాన్ని వచించడం ఇతర ఉద్యోగులకు, ఒకోమారు ప్రభువుకూ కూడా ఇబ్బంది కలిగించి ఉండవచ్చును. కొలువులో చాలీచాలని జీతం, గంపెడు సంసారం, మరోప్రక్క ఏవగింపు కలిగించే లోకం తీరు - ఇవన్నీ కలిసి ఆ మేధావి, పండితుడు, స్వచ్ఛందుడు అయిన వేమనను తిరుగుబాటుదారుగా చేసి ఉండవచ్చును.


అదే కాలంలో దేశంలో నెలకొన్న కరువులు, పాలకుల అక్రమాలు, ఈతిబాధలు అతని ఆలోచనలకు పదును పెట్టాయి. స్వకార్యాలకు, లోకోపకారానికి ఎలాగైనా స్వర్ణ విద్యను సాధించాలని దీక్ష పూనాడు. దాని గురించి మరల మరల ప్రస్తావించాడు. అతని ఎందరో యోగులను, గురువులను దర్శించాడు. వారు చెప్పిన సాధనలు చేశాడు. గురువుల మర్మాన్ని తెలుసుకొన్నాడు. ప్రాపంచిక జీవితంలో ఎంత మోసం, కపటం, నాటకం, దంభం గ్రహించిన వేమన సన్యాసుల బ్రతుకులలో కూడా అవే లక్షణాలున్నాయని తెలుసుకొన్నాడు. వారి మోసమును ఎలుగెత్తి ఖండించాడు.


వేమన భార్య కూతురి పెళ్ళి చేసి అల్లుని ప్రాపున సంసారం లాగిస్తున్నది. వేమనను వెనుకకు రమ్మని అల్లునితో రాయబారం పంపింది కాని వేమన తిరస్కరించాడు. కులాన్నీ, అధికారాన్నీ, అహంకారాన్నీ, సంపన్నుల దౌష్ట్యాన్నీ నిరసిస్తూ ఊరూరా తిరిగి తత్వాలు చెప్పసాగాడు. కొందరు వెర్రివాడని తరిమికొట్టారు. తనను తానే "వెర్రి వేమన్న" అని అభివర్ణించుకొన్నాడు. వేదాంత సారాన్ని తన చిన్న పద్యాలలో పొందుపరచి ఊరూరా ప్రభోధించాడు.


ఆత్మ సంస్కారాన్ని, కుల సంస్కారాన్ని, ఆర్ధిక సంస్కారాన్ని ప్రబోధించాడు. గురువుల కపటత్వాన్ని నిరసించాడు. జీవితంలో, తత్వంలో, దాని ఆచరణలో అంతగా సాధన చేసి బోధించినవారు అరుదు. చివరకు (పామూరు గుహలోనో లేక కడప జిల్లా చిట్వేలు మండలం చింతపల్లి వద్దనో మరెక్కడో) మహాసమాధి చెందాడు.

పద్యాలు

చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ ద్వారా వేమన పద్యాలు వెలుగులోకి వచ్చాయి. పద్యాలన్నీ ఆటవెలది ఛందంలోనే చెప్పాడు. ఎంతో లోతైన భావాన్ని కూడా సరళమైన భాషలో, చక్కటి ఉదాహరణలతో హృదయానికి హత్తుకునేలా చెప్పాడు వేమన. సాధారణంగా మొదటి రెండు పాదాల్లోను నీతిని ప్రతిపాదించి, మూడో పాదంలో దానికి తగిన సామ్యం చూపిస్తాడు. ఉదా:

అల్పుడెపుడు బల్కు నాడంబరముగాను
సజ్జనుండు పలుకు చల్లగాను
కంచుమ్రోగినట్లు కనకంబుమ్రోగునా
విశ్వదాభిరామ వినురవేమ.

కొన్ని పద్యాల్లో ముందే సామ్యం చెప్పి, తరువాత నీతిని చెబుతాడు. ఉదా:
అనగననగరాగ మతిశయించునుండు
తినగ తినగ వేము తియ్యనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ వినుర వేమ.


నాలుగో పాదం "విశ్వదాభిరామ వినుర వేమ" అనే మకుటం. ఈ మకుటానికి అర్థంపై కూడా రెండు వాదనలున్నాయి.

  • వేమన ఆలనా పాలనా చూసిన ఆయన వదిన విశ్వదనూ, ఆయన ఆప్తమిత్రుడు అభిరాముడినీ మకుటంలో చేర్చి వారికి శాశ్వతత్వాన్ని ఇచ్చాడని ఒక వాదన.
  • విశ్వద అంటే విశ్వకారకుడికి, అభిరామ అంటే ప్రియమైనవాడని - అంటే సృష్టికర్తకు ప్రియమైన వేమా, వినుము - అని ఈ మకుటానికి మరో అర్థం చెప్పారు, పండితులు.
బ్రౌను కూడా ఈ రెండో అర్థాన్నే తీసుకుని పద్యాలను ఇంగ్లీషులోకి అనువదించాడు.

వేమన గురించి శోధన, పరిశోధన

వేమన పద్యాలు వందల సంవత్సరాల వరకు గ్రంధస్తం కాకుండా కేవలం సామాన్యుల నోటనే విలచి ఉన్నాయి. వేమన గురించి పరిశోధించి ఆంధ్రులందరికీ తెలియజేసింది పాశ్చాత్యులైన సాహితీవేత్తలు, తెలుగు భాషాభిమానులే అని గ్రహించాలి. 1731లో ఫాదర్ లెగాక్ తొలిసారిగా వేమన పద్యాలు సేకరించాడని పరిశోధకులు భావిస్తారు. 1816లో ఒక ఫ్రెంచి మిషనరీ, తరువాత ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్ ఎన్నో వేమన పద్యాలను సేకరించారు. తాను వేమనను కనుగొన్నానని బ్రౌన్ దొర సాధికారికంగా ప్రకటించుకొన్నాడు. అతను వందల పద్యాలను సేకరించి వాటిని లాటిన్, ఆంగ్ల భాషలలోకి అనువదించాడు. అలాగే హెన్రీ బ్లూచాంస్ (1897), విలియమ్ హోవర్డ్ కాంబెల్ (1910), జి.యు.పోప్, సి.ఇ.గోవర్ వంటి ఆంగ్ల సాహితీవేత్తలు వేమనను లోకకవిగా కీర్తించారు.[1]
తెలుగువారిలో వేమన కీర్తిని అజరామరం చేయడానికి కృషి చేసినవాడు కట్టమంచి రామలింగారెడ్డి. రాష్ట్రంలో పలుచోట్ల వేమన జయంతి ఉత్సవాలు, సంఘాలకై రెడ్డి కృషి చేశాడు.

వేమన పద్యాలకు లభించిన గౌరవాలు

పైన పేర్కొన్న సాహితీ వేత్తల కృషి తరువాత వేమన రచనలకు పండితులనుండి అనన్యమైన గౌరవం లభించసాగింది. కొమర్రాజు వేంకటలక్ష్మణరావు, సురవరం ప్రతాపరెడ్డి, మల్లంపల్లి సోమశేఖరశర్మ, వేటూరి ప్రభాకరశాస్త్రి వంటివారు వేమనను సంస్కర్తగా ప్రస్తుతించారు. తరువాత ఎందరో యువ కవులు, రచయితలు వేమన గురించి, వేమన రచనల గురించి పరిశోధనలు చేశారు. డా. ఎన్. గోపి, బంగోరె వంటివారు వీరిలో ప్రముఖులు.

కేంద్ర సాహిత్య అకాడమీ
వారు ప్రముఖ పాత్రికేయుడు నార్ల వెంకటేశ్వరరావు చేత వేమన జీవిత చరిత్రను వ్రాయించి 14 భాషల్లోకి అనువదింపజేశారు. ఆంగ్ల, యూరపు భాషలన్నింటిలోకి, అన్ని ద్రావిడ భాషలలోకి వేమన పద్యాలు అనువదింపబడ్డాయి. వేమనకు లభించిన ఈ గౌరవం మరే తెలుగు కవికి లభించలేదు. ఐక్య రాజ్య సమితి - యునెస్కో విభాగం వారు ప్రపంచ భాషా కవుల్లో గొప్పవారిని ఎంపిక చేసే సందర్భంలో వేమనను ఎన్నుకొని ఆ రచనలను పలు భాషలలోకి అనువదింపజేశారు.[1]


వేమన పద్యాలలో జ్ఞానం

విశ్వదాభిరామ వినురవేమ

నాటి సమాజ స్వరూపం

దురాచార ఖండన

  • పొడుగు గల్గునట్టి పులితోలు భూతియు
కక్ష పాలలు పదిలక్షలైన మోతచేటెగాని మోక్షంబులేదయా ... విశ్వ.

హేతువాది

ఆ కాలం పరిస్థితులను బట్టి చూస్తే వేమన గొప్ప హేతువాది అని గ్రహింపవచ్చును. సమాజంలో ఎంతో దృఢంగా పాతుకుపోయిన ఆచారాలను, భావాలను అంత నిశితంగా ఎత్తిచూపడానికి చాలా ఆత్మస్థైర్యం, అవగాహన కావాలి.
ఇతరుల సొమ్ముకు ఆశించే లక్షణం "వెన్నదొంగ"లోనూ కనిపిస్తింది.
పాలకడలిపైన పవ్వళించినవాడు
గొల్ల ఇండ్ల పాలు కోరనేల?
ఎదుటివారి సొమ్ము ఎల్ల వారికి తీపి ... విశ్వ.

బంగారు లేడి ఉండదని తెలియని రాముడు దేవుడెలాగయ్యాడు?
కనక మృగము భువిని కద్దులేదనకుండ
తరుణి విడిచిపోయె దాశరధియు
తెలివిలేనివాడు దేవుడెట్లాయెరా? ...విశ్వ.

విగ్రహారాధనను విమర్శిస్తూ
పలుగురాళ్ళు దెచ్చి పరగ గుడులు కట్టి
చెలగి శిలల సేవ జేయనేల?
శిలల సేవ జేయ ఫలమేమికలుగురా? ..విశ్వ.

కులవిచక్షణలోని డొల్లతనం గురించి
మాలవానినంటి మరినీట మునిగితే
కాటికేగునపుడు కాల్చు మాల
అప్పుడంటినంటు ఇప్పుడెందేగెనో? .. విశ్వ.

విజ్ఞానం

వేమన పద్యాలు మరికొన్ని

వేమన పద్యాలన్నిటి కోసం వేమన శతకమును చూడండి.
ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల?
భాండశుద్ధి లేని పాకమేల?
చిత్తశుద్ధి లేని శివపూజలేలరా?
విశ్వదాభిరామ వినురవేమ.

అనువుగానిచోట అధికులమనరాదు

కొంచెముండుటెల్ల కొదువగాదు
కొండ అద్దమందు కొంచెమై యుండదా
విశ్వదాభిరామ వినురవేమ.

చెప్పులోని రాయి చెవిలోని జోరీగ

కంటిలోని నలుసు కాలిముల్లు
ఇంటిలోని పోరు ఇంతింతగాదయా
విశ్వరాభిరామ వినురవేమ.


నిక్కమైన నీలమొక్కటైన చాలు

తళుకు వెళుకు రాలు తట్టెడేల?
చాటు పద్యమిలను చాలదా యొక్కటి
విశ్వదాభిరామ వినురవేమ

ఎలుక తోలు తెచ్చి యేడాది యుతికిన

నలుపు నలుపె కాని తెలుపు గాదు
కొయ్యబొమ్మ దెచ్ఛి కొట్టినా బలుకునా
విశ్వదాభిరామ వినురవేమ
 

వేమన పద్యాలు లోక నీతులు. సామాజిక చైతన్యం వేమన పద్యాల లక్షణం. వేమన సృశించని అంశం లేదు. సమాజంలోని అన్ని సమస్యలు భిన్న కోణాల్లోంచి దర్శించి ఆ దర్శన వైశిష్ట్యాన్ని వేమన తన పద్యాలలో ప్రదర్శించాడు. కుటుంబ వ్యవస్థలోని లోటు పాట్లు, మతం పేరిట జరుగుతున్న దోపిడీలు, విగ్రహారాధనను నిరసించడం, కుహనా గురువులు, దొంగ సన్యాసులు ఒకటేమిటి కనిపించిన ప్రతి సామాజిక అస్థవ్యస్థత మీద వేమన కలం ఝళిపించాడు.

వేమన గురించిన పుస్తకాలు

  • వేమన జ్ఞానమార్గ: 3002 పద్యములు, కూర్పు:ముత్యాల నారసింహ యోగి, ప్రకాశాకులు: సి.వి.కృష్ణా బుక్ డిపో, మదరాసు, 1958.

వేమన గురించి అభిప్రాయాలు


No comments:

Post a Comment